ఒక చిన్న పెనంలో షాజీరా, సోంపు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క వేసి ఒక నిమిషం పాటు వేపి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు వేయించే విధానం
ఒక కడాయి లో నూనె పోసి వేడి చేయాలి.
సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కరకరలాడే వరకు వేయించాలి.
నూనె లో నుండి బయటకి తీసేటప్పుడు గరిటెతో గట్టిగా నొక్కేస్తే నూనె అంతా కారిపోతుంది.కాసేపటికి ఉల్లిపాయలు కరకరలాడతాయి.
మారినేషన్ చేసే విధానం
మటన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, 1 tbsp బిర్యాని మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు సగం, సన్నని పచ్చిమిర్చి తరుగు, పుదీనా, నిమ్మ రసం మరియు పెరుగు వేసి బాగా కలిపి, 4 గంటలు నాననివ్వాలి.
బియ్యం నానబెట్టుట
నాలుగు గంటలలో 3 ½ గంటలు అవ్వగానే బియ్యం నానబెట్టాలి.
అరకేజీ బాసుమతి బియ్యం తీసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
తర్వాత బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి.
అన్నం వండుట కోసం
ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, అందులో సరిపడా ఉప్పు, గరం మసాలా దినుసులు, బిరియాని ఆకులు, నూనె, పుదీనా ఆకులు వేసి మరిగించాలి.
నీరు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వెయ్యాలి.
బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.
అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించి, మరగడం మొదలైన దగ్గర నుండి 3-4 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
కట్టేసిన వెంటనే నీరు వడకట్టేసి ఆ సగం ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి.
బిరియాని వండే విధానం
ఒక మందపాటి అడుగు ఉన్న లోతైన గిన్నెలో, 4 నుండి 5 tbsp ల నూనె(ముందుగానే కాచినది) వేసి, 2 tbsp ల నెయ్యి నానబెట్టిన మటన్ కూడా వేసి సమానంగా పరచుకునేలా సర్దాలి.
తర్వాత దాని మీద సగం ఉడికిన అన్నం వేసి, పైన కొన్ని పుదినా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి, గిన్నెను అల్యూమినియం ఫాయిల్ తో సరిగ్గా కవర్ చేసి మూత పెట్టి 10-15 నిమిషాలు హై ఫ్లేం మీద, తర్వాత 15 నిమిషాలు సిమ్ లో సన్నని సెగ మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.